Breaking News

Nepal Trekking: నేపాల్ పర్యాటక శాఖ కీలక నిర్ణయం.. విదేశీ ట్రెక్కర్లకు షాక్..!

నేపాల్‌ పర్యాటక శాఖ (Nepal Tourism) విదేశీ టూరిస్టులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి ఇతర దేశాల పర్యాటకులు ఆ దేశంలో ఒంటరిగా ట్రెక్కింగ్ (Nepal Solo Trekking) చేయడాన్ని నిషేధించనుంది.


Published on: 07 Mar 2023 18:06  IST

అందమైన హిమాలయాల దేశం నేపాల్ ట్రెక్కర్లకు (Nepal Trekking) స్వర్గధామం. అక్కడ ఒంటరిగా విహరించడాన్ని చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆ దేశం సోలో ట్రెక్కర్లకు షాకిచ్చింది. నేపాల్‌లో ఇకపై ఒంటరిగా విహరించే విదేశీ పర్యాటకుల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి ఇతర దేశాల సందర్శకులు సింగిల్‌గా అక్కడ ట్రెక్కింగ్‌ చేయడాన్ని నిషేధించనుంది. విదేశీ టూరిస్టుల భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ టూరిజం శాఖ వెల్లడించింది. సోలో ట్రెక్కర్లు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా వెంట టూరిస్ట్ గైడ్ ఉండాలని స్పష్టం చేసింది.

అందుకు సంబంధించిన వివరాలను నేపాల్ టూరిజం (Nepal Tourism) శాఖ డైరెక్టర్ మణిరాజ్ లామిచానే తాజాగా మీడియాకు వెల్లడించారు. విదేశీ పర్యాటకుల ప్రయోజనం, భద్రత నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేపాల్ పర్యటనలో విదేశీ పర్యాటకులు సోలోగా ట్రెకింగ్‌ చేస్తూ చాలా మంది తప్పిపోవడం లేదా ఇతర సమస్యలను ఎదుర్కోవడం లాంటివి జరుగుతున్నాయని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో సోలో ట్రెకింగ్‌లపై నిషేధం విధించాలని నిర్ణయించినట్లు వివరించారు. అది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందన్నారు.

 

మరోవైపు నేపాల్ టూరిజం శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. 2019లో సుమారు 50,000 మంది విదేశీ పర్యాటకులు నేపాల్‌లో గైడ్‌లు లేకుండా ట్రెక్కింగ్ చేశారని తెలిసింది. వాళ్లంతా అక్కడ ట్రెక్కింగ్‌ చేసేందుకు అనుమతించే రూట్ పర్మిట్, ట్రెక్కర్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (TIMS) కార్స్‌ని పొంది తమ ప్రయాణాలు సాగించారు. నేపాల్‌లో TIMS కార్డ్ అనేది విదేశీ టూరిస్టులు సాహసయాత్రలు చేసేందుకు అనుమతించే ప్రాథమిక ట్రెక్కింగ్ అనుమతి. అప్పుడు వారు ఒంటరిగా ట్రెక్కింగ్ చేసే వీలుండేది. ఈ క్రమంలోనే పలువురు తప్పిపోవడం, ప్రమాదాల బారిన పడటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా నిర్ణయంతో గైడ్ లేకుండా TIMS కార్డ్‌ను కూడా జారీ చేయరు. దీంతో పర్యాటకులు ఏదైనా ట్రెక్కింగ్ కంపెనీ ద్వారానే అక్కడ ట్రెక్కింగ్ చేయాలని మణిరాజ్ పేర్కొన్నారు. కాగా, నేపాల్ పర్యాటక శాఖ తాజాగా ఆ టిమ్స్ అనుమతి కార్డ్‌ ధరను రూ.2 వేలకు పెంచింది. ఇంతకుముందు బృందాలుగా వెళ్లే ప్రయాణికులకు అది రూ. వెయ్యికే దొరికేది.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి