

మెడలో మిర్చి దండలు వేసుకుని బీఆర్ఎస్ వినూత్న నిరసన
మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Published on: 17 Mar 2025 12:40 IST
హైదరాబాద్: మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయిందని, సరైన ధర లేకపోవడంతో ప్రస్తుత సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాలల్లో పంట సాగయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెవాలని, మిర్చి మద్దతు ధర క్వింటాల్కు రూ.25 వేల నిర్ణయించి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.
తెలంగాణ సాగుచేసిన మిర్చి పంటను విదేశాలకు ఎగుమతిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలిలో విపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కవిత, నవీన్ కుమార్, తాతా మధు, మహమూద్ అలీ, నవీన్ కుమార్ రెడ్డి, వాణి దేవి పాల్గొన్నారు.