

అసెంబ్లీ అధికారులు అక్కడ ఏం జరిగిందనే క్లారిటీ ఇచ్చారు..
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సమయంలో అసెంబ్లీ ఆవరణలో చోరీలు జరిగినట్లు వచ్చిన ప్రచారంపై. అక్కడ ఏం జరిగిందనే స్పష్టత ఇచ్చిన అధికారులు
Published on: 04 Apr 2025 15:46 IST
ఏపీ అసెంబ్లీ: ఇటీవలగా ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఐదుగురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఎమ్మెల్యే కోటాలో బీటీ నాయుడు, సోము వీర్రాజు, కొణిదెల నాగబాబు; గ్రాడ్యుయేట్ కోటాలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో డబ్బుల చోరీ జరిగిందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీశాయి. సమాచారం ప్రకారం కొంతమంది వ్యక్తుల జేబుల్లో ఉన్న లక్షల రూపాయల నగదు దొంగలించారు అన్న వార్తలు వినిపించాయి. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు రూ.10 వేలు, ఆయన గన్మెన్ రూ.40 వేలు, హైకోర్టు లాయర్ రూ.50 వేలు, మరో వ్యక్తి రూ.32 వేలు పోయినట్టు ప్రచారం జరిగింది.
అయితే ఈ నేపథ్యంలో అసెంబ్లీ అధికారులు స్పందిస్తూ, అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి దొంగతనాలు జరగలేదని స్పష్టం చేశారు. దొంగతనాలపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసెంబ్లీ ప్రాంగణంలో అలాంటి ఘటన ఏదీ జరగలేదని గురువారం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
అధికారుల వివరాల ప్రకారం, తప్పు సమాచారం మీద ఆధారపడి నిర్ధారణ లేకుండా వదంతులు వ్యాప్తి చేయడం సరికాదని, ప్రజలు వాటిని నమ్మొద్దని సూచించారు. నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ప్రశాంత వాతావరణంలో పూర్తయిందని తెలిపారు.