Breaking News

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన డోజ్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన డోజ్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.


Published on: 29 May 2025 08:21  IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వం అంతర్గతంగా నిర్వహిస్తున్న "డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ" (DOGE)కు గుడ్‌బై చెబుతూ, ఆ పదవికి విరమిస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా మస్క్‌ మాట్లాడుతూ... "అమెరికా ప్రభుత్వం తరఫున పని చేసే గవర్నమెంట్‌ ఉద్యోగిగా నా బాధ్యతలు పూర్తయ్యాయి. ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు అవకాశం కల్పించిన ట్రంప్‌కు ధన్యవాదాలు. డోజ్ మిషన్‌ భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష పదవిలోకి వచ్చాక, ప్రభుత్వ వ్యవస్థలో సమర్థతను పెంచడానికి DOGE విభాగాన్ని ప్రారంభించారు. ఈ శాఖకి మస్క్‌ను ముఖ్య బాధ్యతలతో నియమించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడం ఈ డిపార్ట్‌మెంట్‌ ప్రధాన లక్ష్యాలుగా ఉండాయి.

DOGE పనిచేసే తీరును ప్రస్తావిస్తే... అవసరం లేని ఖర్చులను తగ్గించేందుకు అనేక సూచనలు చేసింది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపునకు సైతం ఈ శాఖ సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వ వ్యవహారాల్లో మస్క్ హస్తక్షేపం ఎక్కువగా ఉందన్న విమర్శలు వచ్చాయి. కానీ ట్రంప్ మాత్రం మస్క్‌ తీసుకున్న నిర్ణయాలను మద్దతుగా నిలిపారు.

ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లుపై మస్క్ తొలిసారిగా భిన్నంగా స్పందించారు. ఆ బిల్లుకు అధిక బడ్జెట్‌ కేటాయించాల్సిన పరిస్థితి రావడంతో, ప్రభుత్వ వ్యయాలను తగ్గించాలన్న DOGE లక్ష్యాలకు భంగం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలే ఆయన వైదొలగడానికి ప్రధాన కారణాలుగా భావించవచ్చు.

అమెరికా చట్టాల ప్రకారం, ఏ వ్యక్తి కూడా వరుసగా 130 రోజులకు మించి ప్రత్యేక ప్రభుత్వ సలహాదారు హోదాలో కొనసాగకూడదు. ఈ నిబంధనల ప్రకారం మస్క్‌ పదవి మే 30తో పూర్తవుతుంది. చట్ట ప్రకారమే ఆయన ఈ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించారు.

మస్క్‌ వెళ్తున్నా, DOGE శాఖ పనిచేయడం ఆగదు. దీనిపై ఇప్పటికే ట్రంప్‌ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్‌ సెక్రటరీలు ఈ శాఖను ముందుకు నడిపిస్తారని తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత పెంపు కోసం ఈ శాఖ మరింత బలంగా పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి