Breaking News

తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ నోరువిప్పారు.

పాక్‌ సైన్యం మేల్కొనేలోపే బ్రహ్మోస్‌ క్షిపణులతో భారత్‌ విధ్వంసం సృష్టించిందన్న పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌.


Published on: 30 May 2025 08:37  IST

ఆపరేషన్‌ సిందూర్‌ కింద భారత్‌ చేపట్టిన సాహసోపేత దాడుల వల్ల తమ వైమానిక స్థావరాలకు భారీ నష్టం జరిగిందని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులతో పాక్‌ సైన్యాన్ని ముందుగానే ఆందోళనలోకి నెట్టిందని ఆయన వెల్లడించారు.తమ సైన్యం ప్రతిదాడికి సిద్ధమవుతున్న సమయంలోనే భారత్‌ ముందుగా వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించిందని షరీఫ్‌ అన్నారు. మే 10న తెల్లవారుజామున భారత్‌పై దాడికి పాక్‌ సన్నద్ధమవుతుండగా, మే 9 రాత్రే భారత్‌ తన చర్యలను ప్రారంభించిందని వివరించారు.‘‘నాలుగున్నర గంటలకు మేము దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాం అనుకునేలోపే భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులతో రావల్పిండి విమానాశ్రయంతో పాటు కీలక వైమానిక స్థావరాలపై దాడి చేసింది’’ అని షరీఫ్‌ తెలిపారు. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ నుంచి తాను ముందే సమాచారాన్ని అందుకున్నానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన భారత్‌తో కశ్మీర్‌, నీటి ఒప్పందాలు, ఉగ్రవాదం వంటి ప్రధాన సమస్యలపై చర్చలు జరపాలని కోరారు. ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షల ప్రకారం పరిష్కారానికి సిద్ధమని చెప్పారు. ఉగ్రవాదంపైనూ చర్చలకు తాము సిద్ధమని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని ఆకాంక్షించారు.

పాకిస్తాన్‌కు కీలకమైన తాగు, సాగునీటి అవసరాల కోసం సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘిస్తోందని షరీఫ్‌ ఆరోపించారు. ఈ విషయంలో భారత వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌ ప్రధాని చేసిన సంభాషణలకు భారత ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదానికి గట్టి చర్యలు తీసుకోకపోతే, పాకిస్తాన్‌తో చర్చలు జరగబవని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అలాగే, సింధు జలాల ఒప్పందం అమలు కావాలంటే ఉగ్రవాదానికి మద్దతు ఆపాలని పేర్కొంది.

భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ—పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్‌)ను ఖాళీ చేయకుండా, ఉగ్రవాదులను అప్పగించకుండా కశ్మీర్‌ అంశంపై చర్చలేవీ ఉండబవని స్పష్టం చేశారు.ప్రధాని మోదీ గతంలో చేసిన "నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు", "ఉగ్రవాదం, వాణిజ్యం కలసి నడవవు" అనే వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి