Breaking News

50 నిమిషాలు..18 ప్రశ్నలు.. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను ఏం అడిగింది..? ఆయన ఏం చెప్పారు..?

ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్​అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ఇంజనీర్ల బాధ్యత అని కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం.


Published on: 12 Jun 2025 08:05  IST

తెలంగాణ రాష్ట్రంలో నదీజలాల వినియోగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విచారణలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా హాజరై సమాధానాలు ఇచ్చారు. ఈ విచారణ వన్ టు వన్ పద్ధతిలో నిర్వహించబడింది.కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్‌ జస్టిస్ పీసీ ఘోష్ స్వయంగా ప్రశ్నించారు. విచారణ మొత్తం 50 నిమిషాలు కొనసాగింది. ఇందులో మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. కేసీఆర్ అన్ని ప్రశ్నలకు స్థిరంగా, స్పష్టంగా సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్​ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్​ సమాధానాలు ఇవీ.. 

కమిషన్: బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం ఎవరి ఆధ్వర్యంలో తీసుకున్నారు?

కేసీఆర్: బ్యారేజీల స్థల మార్పులు పూర్తిగా సాంకేతిక విషయాల ఆధారంగా జరిగాయి. ఇలాంటి అంశాల్లో నిర్ణయాలు ఇంజనీరింగ్ నిపుణులే తీసుకున్నారు. టెక్నికల్ నివేదికలు, వ్యాప్కోస్ అధ్యయనాలపై ఆధారపడి వాటి స్థానాల్లో మార్పులు చేశారు. ఇందులో రాజకీయ నిర్ణయాల ప్రమేయం లేదు.

కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్‌ ఏర్పాటుపై వివరణ ఇవ్వగలరా?

కేసీఆర్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు సమీకరించాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉండడంతో రుణాల కోసం ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రాజెక్టు ఆదాయాన్ని పొందే వరకు, అప్పుల తిరుగుబాటుకు ప్రభుత్వం గ్యారంటీగా నిలిచింది. అప్పులందించిన సంస్థలు కేంద్ర ప్రభుత్వ హామీ కోరిన సందర్భంలో, రాష్ట్రం పూచీకత్తు ఇచ్చింది.

కమిషన్: కాళేశ్వరం ప్రాజెక్టు మరియు బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ అనుమతి ఉందా?

కేసీఆర్: ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతీ అంశాన్ని మంత్రివర్గ సమావేశాల్లో చర్చించి, అంగీకారం పొందాం. పూర్తి స్థాయిలో కేబినెట్ ఆమోదం తీసుకున్నాం.

కమిషన్: 2017 డిసెంబర్ 9న జరిగిన సమీక్షా సమావేశానికి సంబంధించిన అధికార నివేదికల గురించి చెప్పగలరా?

కేసీఆర్: ఆ సమీక్ష సమావేశానికి సంబంధించిన మినిట్స్‌లో అన్ని ముఖ్య విషయాలు నమోదు అయ్యాయి. అందులో పేర్కొన్నవి నిజమైనవే. బ్యారేజీలకు సంబంధించిన టెండర్ ప్రక్రియను సంబంధిత అధికార శాఖలు నిర్వహించాయి. నిర్మాణానంతర పరిపాలన, నిర్వహణ కోసం 2020 డిసెంబర్ 28న జీవో నంబర్ 45 విడుదల చేయబడింది. ఇందుకోసం రూ.280 కోట్లు మంజూరు చేశాం. అలాగే, బ్యారేజీల వద్ద యంత్రాంగ నిర్వహణ కోసం ఈఈ స్థాయి ఇంజినీర్లను నియమించాం.

కమిషన్: కేంద్ర ప్రభుత్వ అనుమతులు పూర్తిగా లభించాయా? మేడిగడ్డను ఎంచుకునే వరకు తీసుకున్న నిర్ణయాలపై వివరాలు చెప్పగలరా?

కేసీఆర్: ప్రాజెక్టుకు అవసరమైన 11 అనుమతులను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పొందాం. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. వారి సూచన మేరకు మేడిగడ్డ వద్ద నీటి మాతృ సోర్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మూడు విభిన్న స్థలాల్లో లైడార్ సర్వేలు నిర్వహించి, వాటి ఆధారంగా మేడిగడ్డను ఎంచుకున్నాం. ఇందుకు కేంద్రం అనుమతి కోరుతూ స్వయంగా ప్రధానిని లేఖ రాశాను.

తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకపోవడం, అక్కడ వన్యప్రాణుల అభయారణ్యం ఉండటం వంటి కారణాలతో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాం. అదనంగా, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఓపెన్ కెనాల్ నిర్మాణం ప్రతిపాదించినా, ఆ మార్గంలో బొగ్గు బ్లాకులు ఉండటంతో సాధ్యపడలేదు.

మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు సర్వేల్లో తేలింది. అందులో 230 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉందని తేలడంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నాం.

విచారణ జరుగుతున్న కోర్టు హాల్‌లో కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్, మాజీ సీఎం కేసీఆర్, కమిషన్ కార్యదర్శి, ఇద్దరు నోడల్ అధికారుల సమక్షంలో విచారణ సాగింది. ఉదయం 11:58కి కేసీఆర్ హాల్‌లోకి ప్రవేశించగా, 12:02 గంటలకు కమిషన్ చైర్మన్ విచారణ ప్రారంభించారు. దేవుని పేరుతో ప్రమాణం చేసి మొదలైన విచారణ ప్రక్రియ 12:52 వరకు సాగింది. మొత్తం 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్‌ తరఫున కేసీఆర్‌కు సుమారు 18 ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన పలు డాక్యుమెంట్లు సమర్పించారని, ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా కమిషన్‌కు అందించినట్టు తెలుస్తోంది. ఇది ఇటీవల హరీష్ రావు అందించిన పీపీపీటీలో కొన్ని మార్పులు చేసి రూపొందించినట్టు సమాచారం.

కేసీఆర్‌ను బుధవారం ఉదయం ఫామ్‌హౌస్‌ వద్ద హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు ఇతర నేతలు కలిశారు. అక్కడి నుంచే వారు విచారణకు బయల్దేరారు. అయితే కవిత తప్ప మిగిలిన నేతలు బీఆర్కే భవన్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్‌ నాయకుల పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని, కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై గుమికూడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విచారణ నేపథ్యంలో భవన్ చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వన్-టు-వన్ విచారణ 

తొలుత ఓపెన్ కోర్ట్‌లో విచారణ జరగనుందని భావించినా, ఆరోగ్యం సహకరించడం లేదని కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో వన్-టు-వన్ విచారణకు కమిషన్ అంగీకరించింది. ఈ కారణంగా అక్కడికొచ్చిన మీడియా ప్రతినిధులు, అధికారులు బయటికి పంపించబడ్డారు. చివరి నిమిషంలో కమిషన్ వర్గాలు ఇది ఓపెన్ కోర్ట్‌ కాదు, ఇండోర్ విచారణ అని స్పష్టం చేశాయి. చట్టపరమైన పరిమితుల ప్రకారం కేసీఆర్‌కు వ్యక్తిగత విచారణ (ఫేస్ టు ఫేస్) అవకాశం కల్పించినట్టు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.

Follow us on , &

ఇవీ చదవండి