

కలిమా చెప్పలేదని కాల్చి చంపినా ఉగ్రవాదులు
పహల్గాం దాడి: మతం ఆధారంగా టార్గెట్ చేశారా? కలిమా చెప్పలేదని చంపినా ఉగ్రవాదులు "కలిమా"తో ప్రాణాలు దక్కించుకున్న కొందరు పర్యాటకులు.
Published on: 24 Apr 2025 17:09 IST
న్యూఢిల్లీ: పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో మొత్తం 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, కొన్ని వార్తా మూలాల ప్రకారం, ఈ దాడి మతం ఆధారంగా జరిపిన దాడిగా భావిస్తున్నారు. "కలిమా" అనే ఇస్లామిక్ ప్రార్థనను పలకలేకపోయిన వారిపై ఉగ్రవాదులు దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
కలిమా అంటే ఏమిటి?
ఇస్లాం మతంలో కలిమా అనేది ఒక ముఖ్యమైన మంత్రం. దీన్ని ‘ లా ఇలాహ్ ఇల్లాహ్, మొహమ్మదుర్ రసూలుల్లా’ అని పలుకుతారు. దీని అర్థం — "దేవుడు లేరు, అల్లా ఒక్కడే దేవుడు. ముహమ్మద్ ఆయన ప్రవక్త." ముస్లింలు ఈ మంత్రాన్ని జీవితాంతం తమ ప్రార్థనల్లో పఠిస్తారు. చిన్న పిల్లల చెవుల్లో ఈ సూక్తులు వినిపిస్తారు. మరణ సమయంలో కూడా ఈ మంత్రాన్ని పలకడం పవిత్రమైనదిగా భావిస్తారు.
దాడి సమయంలో ఏం జరిగింది?
అస్సాంలోని డాక్టర్ దేబశిష్ భట్టాచార్య అనే వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం, తుపాకీతో తనపై గురి పెట్టిన ఉగ్రవాది ముందు, ఆయన గట్టిగా కలిమా చదవడంతో తాను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు చెప్పారు. తన చుట్టూ ఉన్న వారంతా అదే మంత్రం చదవడంతో అందరూ బయటపడ్డారని తెలిపారు.
కేరళకు చెందిన ఆర్తి మీనన్కు జరిగిన సంఘటన మరింత విషాదకరం. ఆమె తండ్రి రామచంద్రన్, కుటుంబంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కలిమా చెప్పలేదని, చదవలేనని చెప్పిన తర్వాతే ఉగ్రవాదులు అతన్ని కాల్చినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులు ప్రజలను ఓ గుంపుగా నిలబెట్టి ప్రశ్నలు వేయడం, కలిమా పలకమని ఒత్తిడి చేయడం, పలకలేని వారిపై కాల్పులు జరపడం వంటి ఆరోపణలు బాధితుల మాటల్లో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా భయంతో ఏడవడాన్ని చూసి ఉగ్రవాదులు వెళ్లిపోయారని ఆర్తి వెల్లడించారు.