Breaking News

ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం

ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్‌ స్పష్టం చేసింది.


Published on: 20 Jun 2025 08:49  IST

పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌ మరియు ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. ఈ క్రమంలో అమెరికా కూడా  రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇరాన్‌ అణు కార్యకలాపాలను ఒక రిస్క్‌గా పరిగణిస్తూ, అవసరమైతే సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ అంశంపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ కీలక ప్రకటన చేసింది. రెండు వారాల వ్యవధిలో ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టాలా వద్దా అన్న దానిపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్‌-టెహ్రాన్‌ మధ్య మాటల యుద్ధం ముదిరిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్‌ సైనిక దాడికి ఒక అంచనా వేస్తున్నా, మొదటిగా దౌత్యపరమైన పరిష్కారాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటారని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ తెలిపారు.

ఇరాన్‌ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ట్రంప్‌కు అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఒప్పందం వచ్చినా, అది టెహ్రాన్‌ యురేనియం నిల్వలను నియంత్రించడం, అణ్వాయుధ సామర్థ్యాన్ని తగ్గించడంపైనే దృష్టి పెట్టినదై ఉంటుందని స్పష్టం చేశారు.

అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడూ శాంతియుత మార్గాలకే ప్రాధాన్యత ఇస్తారని, అవసరమైతే శక్తిని వినియోగించడంలో వెనుకాడరని కరోలిన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సైనిక చర్యకు సంబంధించిన ప్రతిపాదనలపై ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ, తుది ఉత్తర్వులు ఇంకా జారీ చేయలేదు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక ప్రకారం, ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని ఆపుతుందా లేదా అన్నదానిపై స్పష్టత వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటారని ట్రంప్‌ భావిస్తున్నారు.

ఇంతకుముందు ట్రంప్‌ను ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి సిద్ధమా అని ప్రశ్నించగా, తాను దాడి చేయొచ్చు, చేయకపోవచ్చు అంటూ సమాధానమిచ్చారు. రాబోయే వారం చాలా కీలకంగా ఉండబోతోందని, కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సంకేతాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో రష్యా కూడా తన స్పందనను వెల్లడించింది. ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా జోక్యం చేయడం చాలా ప్రమాదకరమని, ఇది అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూలతలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిత్రదేశంగా రష్యా, ఇరాన్‌కు మద్దతు తెలిపే సందర్భంలో ఇది గమనార్హంగా మారింది.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌లోని ఓ ఆసుపత్రిపై ఇరాన్‌ క్షిపణి దాడి జరిపినట్టు సమాచారం. దీనిపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. టెహ్రాన్‌ చేసిన దాడికి వారు చాలా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాము లక్ష్యంగా ఎంచుకునేది అణు కేంద్రాలైతే, ఇరాన్‌ మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తోందని ఆరోపించారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయంగా గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య సుదీర్ఘ విభేదాల నేపథ్యంలో అమెరికా జోక్యం ఎలా మలుపు తిప్పుతుందో అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement