Breaking News

రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా 472 డ్రోన్ల తో విరుచుకుపడిన ఉక్రెయిన్‌

రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ పర్యవేక్షణ లో దాడులు.


Published on: 02 Jun 2025 08:19  IST

తూర్పు యూరోప్‌ మళ్లీ యుద్ధ మబ్బులు కమ్ముకున్నాయి. రష్యా – ఉక్రెయిన్‌ మధ్య శాంతి చర్చలు జరగనున్న క్షణాల్లోనే ఉక్రెయిన్ చేపట్టిన హఠాత్‌ దాడులు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. తుర్కియేలోని ఇస్తాంబుల్‌ నగరంలో సోమవారం శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ఉక్రెయిన్‌ తీసుకున్న సైనిక చర్యలు చర్చలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ స్వయంగా పర్యవేక్షించిన ఈ దాడుల్లో రష్యా లోపలికి చొచ్చుకుని వెళ్లి మరీ వివిధ వైమానిక స్థావరాలు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా సైబీరియా ప్రాంతంలోని ఇర్కుట్స్క్ వైమానిక స్థావరంపై మధ్యాహ్న సమయంలో భారీ దాడి జరగడంతో సుమారు 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని సమాచారం. ఇదే ప్రాంతంలో ఉక్రెయిన్‌ తొలిసారి దాడులు చేయడం గమనార్హం.

ఈ దాడులు ఒకటి కాదు – ర్యాజన్, ముర్మన్స్క్ వంటి ఇతర ప్రాంతాలపై కూడా డ్రోన్లతో ఉక్రెయిన్‌ దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌ కోసం ఉక్రెయిన్ ముందుగానే ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ప్రత్యేకంగా తయారుచేసిన డ్రోన్లను కంటెయినర్లలో పెట్టి రష్యాలోకి తరలించడంతోనే 4,000 కిలోమీటర్ల  వరకు చొచ్చుకెళ్లగలిగిందని విశ్లేషణలు వెల్లడించాయి.

ఈ దాడుల్లో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, ఏ-50 రాడార్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి కీలకమైన విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇవి రష్యా వైమానిక దళాలకు ముఖ్యమైన ఆయుధాలు కావడం వల్ల భారీ నష్టంగా పరిగణిస్తున్నారు.

ఇర్కుట్స్క్ గవర్నర్ ఉక్రెయిన్ దాడిని ధ్రువీకరించారు. రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం – ముర్మన్స్క్, ఇర్కుట్స్క్, ఇవానోవా, ర్యాజన్, అముర్ ప్రాంతాలపై డ్రోన్ల దాడులు జరిగాయని పేర్కొంది. అయితే ఈ దాడుల్లోని చాలా వాటిని తాము తిప్పికొట్టామన్నది మంత్రిత్వశాఖ వాదన.

రష్యా భద్రతా బలగాలు ఇప్పటికే డ్రోన్లను తరలించిన ట్రక్కును గుర్తించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

దాడులు కేవలం వైమానిక స్థావరాలకే పరిమితం కాలేదు. రష్యా పశ్చిమ సరిహద్దుల్లోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఒక వంతెన పై శనివారం రైలుపై జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అదే ప్రాంతంలో మరో గూడ్స్‌ రైలు కూడా వంతెన కూలిన తర్వాత పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. కర్స్క్ ప్రాంతంలో మరో రైల్వే వంతెన ధ్వంసమై రైలు పట్టాలు తప్పడం గమనార్హం.

ఉక్రెయిన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా రష్యా కూడా భారీంగా తిరిగి దాడి చేసింది. ఒకేరోజు 472 డ్రోన్లతో విస్తృతమైన దాడిని చేపట్టినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇది యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రష్యా చేసిన అత్యంత పెద్దదైన డ్రోన్‌ దాడిగా గుర్తిస్తున్నారు.

ఈ దాడిలో ఉక్రెయిన్‌లోని ఒక సైనిక శిక్షణా కేంద్రంపై దాడి జరగగా, 12 మంది సైనికులు మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. రష్యా సైన్యం ఒలెక్సివ్‌కా గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

 శాంతి చర్చల నీడలోనే  ప్రతీకార చర్యలు కొనసాగుతుండడం – యుద్ధం త్వరగా ముగిసే అవకాశం లేదన్న అంచనాలను బలపరుస్తోంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం మరింత విస్తృత రూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళనను అంతర్జాతీయంగా  వ్యక్తం చేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి