Breaking News

ప్రతీకార సుంకాల గడువు పొడిగించవచ్చూ.. కుదించవచ్చు: ట్రంప్‌

ప్రతీకార సుంకాల గడువు పొడిగించవచ్చూ.. కుదించవచ్చు: ట్రంప్‌


Published on: 28 Jun 2025 09:06  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి సుంకాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న దిగుమతులపై అమెరికా ఇప్పటికే పలు దేశాలకు భారీ టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ టారిఫ్‌ల అమలుకు నిర్ణయించిన గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ స్పందిస్తూ – అప్పటికే విధించిన సుంకాలను వెంటనే తిరిగి అమలు చేయాలా, వాయిదా వేయాలా అనే దానిపై తాము ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతేకాదు, వాణిజ్య ఒప్పందాల చర్చలు ఎలా కొనసాగుతాయన్న దాని మీదే తుదినిర్ణయం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

టారిఫ్‌ల వ్యవహారంలో తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ట్రంప్‌ తెలిపారు. తాము నిర్ణయించిన గడువును అవసరమైతే పొడిగించవచ్చని, లేకపోతే ముందే ముగించవచ్చని వివరించారు. తాను వ్యక్తిగతంగా త్వరితగతిన ఒప్పందాన్ని ఫైనల్ చేయడానికే ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ దిగుమతులపై 25 శాతం వరకు సుంకాలను విదించామని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలను అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్‌ కూడా తెలిపారు. ఆయన మాటల్లో, వచ్చే సెప్టెంబర్‌ 1న జరగనున్న లేబర్‌ డే నాటికి పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్న విశ్వాసం వ్యక్తమైంది.

ఇటీవల మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా టెహ్రాన్‌పై చేసిన దాడులు, తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు అమెరికా పార్లమెంట్‌లో భారీ చర్చలు చెలరేగాయి. ముఖ్యంగా వ్యయ ప్యాకేజీలు, సుంకాల పెంపు నేపథ్యంలో ట్రంప్‌ పరిపాలన వాణిజ్య ఒప్పందాల చర్చలను వేగవంతం చేసింది. తాజాగా యూరోపియన్ యూనియన్‌కు కొత్త ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇదే సమయంలో భారత్‌తో కూడా పెద్ద ఒప్పందం కుదరనున్నట్లు ట్రంప్‌ వ్యాఖ్యానించటం గమనార్హం.

భారత్‌ ఇప్పటికే ట్రేడ్‌ చర్చల కోసం ఓ ప్రతినిధి బృందాన్ని వాషింగ్టన్‌కు పంపినట్టు సమాచారం. ఈ చర్చలు అనుకూలంగా జరిగితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత బలపడే అవకాశముంది. స్కాట్ బీసెంట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికా ప్రస్తుతం 18 దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చే ప్రయత్నంలో ఉంది. అందులో 10 నుంచి 12 దేశాలతో డీల్‌ పూర్తయితే సెప్టెంబరు నాటికి వాణిజ్య ఒప్పందాల దశ ముగిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇక, అమెరికా టెక్ కంపెనీలపై కెనడా విధించిన ప్రతీకార సుంకాల నేపథ్యంలో ట్రంప్‌ కెనడాతో వాణిజ్య చర్చలు ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. కెనడాతో వ్యాపారం చేయడం సవాలుతో కూడుకున్న విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన ట్రూత్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. మరోవైపు చైనాతో తమ వాణిజ్య ఒప్పందం పూర్తయినట్లు ట్రంప్‌ తెలిపారు. అయితే, ఆ ఒప్పందానికి సంబంధించిన స్పష్టమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఈ మొత్తం పరిణామాల దృష్ట్యా, అమెరికా అధికారం వహిస్తున్న ట్రంప్‌ పాలన వాణిజ్య రంగంపై గణనీయమైన ప్రభావం చూపేలా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ వాణిజ్య రంగం ఈ సుంకాల నిర్ణయాలపై ఆశ్చర్యంతో చూస్తోంది. భారత్‌ వంటి దేశాలకు ఇది కీలక సమయం. పరస్పర ప్రయోజనాల దృష్ట్యా అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందడుగు వేసినట్టు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి