Breaking News

ఇలాంటి వాడితో జాగ్రత్తగా ఉండండి!

ఈ రోజుల్లో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, షేర్ చాట్ ఇలా ఎన్నో సామాజిక మాద్యమాలు ఉన్నాయి. యూత్‌లో కూడా ప్రతి ఒక్కరికి కచ్చితంగా అకౌంట్ ఉంటుంది. అందులోనూ అమ్మాయిలు కూడా ఈ యాప్‌లను ఉపయోగిస్తుంటారు.. అయితే ఇటీవల కాలంలో కొందరు జులాయిగాళ్లు అమ్మాయిల్ని ట్రాప్ చేసి బెదిరిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ పోకిరీ ఆటకట్టించారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు.


Published on: 18 Oct 2023 11:29  IST

కృష్ణాజిల్లా గుడ్లవల్లూరు మండలం మేమవరానికి చెందిన లంకా రాజేష్‌ డిగ్రీ వరకు చదివాడు. ఆ తర్వాత చెడువ్యసనాలకు బానిసై.. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఓ ప్లాన్ చేశాడు. షేర్‌చాట్‌లో యువతులకు మెసేజ్‌లు పంపి వారిని ట్రాప్ చేస్తున్నాడు.. మెల్లిగా వారితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత వారితో చనువుగా ఉంటూ కలిసినపుడు బలవంతంగా ఫొటోలు తీసుకుంటాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలు పెడతాడు.. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు.

ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి సింగరాయకొండకు చెందిన ఒక యువతితో షేర్‌చాట్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెతో చనువుగా ఉన్నాడు. అప్పుడప్పుడూ ఆ యువతిను కలుస్తూ ఆమెతో ఫొటోలుకూడా దిగాడు. అనంతరం వాటిని ఆమె బంధువులకు పంపుతానని.. సోషల్‌మీడియోలో షేర్‌ చేస్తానని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలో ఈనెల 5న సింగరాయకొండలో యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమె గొంతుపై కత్తిపెట్టి చంపుతానని బెదిరించి రూ.20వేలు బలవంతంగా తీసుకొని పారిపోయాడు. ఆ తర్వాత కూడా యువతికి పదేపదే ఫోన్‌చేసి డబ్బులు పంపించాలని బెదిరించాడు.

ఈ నెల 11న డబ్బులు పంపించకపోవడంతో ఆ యువతితో దిగిన కొన్ని ఫొటోలను ఆమె కుటుంబసభ్యులకు రాజేష్‌ పంపాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా మలిక గర్గ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుడు రాజేష్‌ను సింగరాయకొండలోని స్థానిక కందుకూరు రోడ్డు సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నారు.ఈ యువకుడు గతంలో మరికొందరు యువతులను కూడా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు, కామెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అమ్మాయిల్ని హెచ్చరిస్తున్నారు.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి