Breaking News

ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి. అణు స్థావరాలను నాశనం చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబులు వేసింది.

ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి. అణు స్థావరాలను నాశనం చేసింది. శుక్రవారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై బాంబులు వేసింది.


Published on: 13 Jun 2025 09:14  IST

శుక్రవారం తెల్లవారుజామున ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసే ఘటనగా, ఇజ్రాయెల్ తన శత్రుదేశమైన ఇరాన్‌పై భారీ వైమానిక దాడికి పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని, అక్కడ ఉన్న అణుశక్తి సంబంధిత కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ దాడితో టెహ్రాన్ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. పేలుళ్ల శబ్దాలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. దాంతో నగరమంతా పొగలు, మంటలతో కమ్ముకుపోయినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్‌ తన లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదించిందని భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, ఇది పూర్తిగా లక్ష్యబద్ధంగా ప్లాన్ చేసిన ఆపరేషన్ అని తెలిపారు. ఇరాన్ వేగంగా అభివృద్ధి చేస్తున్న అణు కార్యక్రమం ప్రపంచానికి ప్రమాదకరమని అభిప్రాయపడుతూ, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు, ఆర్ధికంగా కీలకమైన అణు శోధన కేంద్రాలపై ఈ దాడి జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ ప్రకారం ఈ దాడిలో ఇరాన్‌ భారీ నష్టాన్ని చవిచూసింది.

ఇరాన్ ఎప్పటి నుంచో తన అణు ప్రాజెక్టుల వేగాన్ని పెంచుతూ, గోప్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు సూచించాయి. ఇటీవల టెహ్రాన్‌ పరిధిలో కీలకమైన అణు పరిశోధన కేంద్రాలు భారీ స్థాయిలో క్రియాశీలంగా మారాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి, ఆదేశం ఇక వెనక్కి తగ్గే స్థితిలో లేదనే సంకేతాలను ఇస్తోంది. టెహ్రాన్ నగరంలో చౌకబారు ప్రాంతాలు సహా పలు కీలక భద్రతా ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఇరాన్ ఈ దాడిపై తగిన విధంగా ప్రతిస్పందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే తమ సైనిక సన్నద్ధతను పెంచామని, అవసరమైతే తక్షణమే జవాబివ్వగలమని ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడికి తగిన తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందని, తమ భద్రత కోసం ఏదైనా చేయడంలో వెనకడుగేయమని కూడా వారు హెచ్చరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరకుండా చూసేందుకు కృషి చేస్తున్నాయి. శాంతియుత చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమని జాతీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఇజ్రాయెల్ దాడి తర్వాత తాత్కాలికంగా తమ దేశపు వైమానిక మార్గాలను మూసివేసింది. విమాన రాకపోకలపై ప్రభావం పడింది. అంతే కాకుండా టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ప్రయాణాలు నిలిపివేయబడ్డాయి. ఈ పరిణామాలు మిడిలీస్ట్ ప్రాంత భద్రతపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశమున్నందున, రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రస్తుతం అంతా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు – ఇరాన్ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? దీనికి తగిన జవాబు ఇస్తుందా? లేదా అంతర్జాతీయ ఒత్తిడికి లోనవుతుందా? అన్నదే ఆసక్తికర అంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి