Breaking News

ప్రస్తుత మదింపు సంవత్సరం (2025-26)కు గాను రిటర్నులు దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారా?

పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి కొత్త నిబంధనలు కొంత సవాలుగా మారుతున్నాయి.


Published on: 20 Jun 2025 08:40  IST

ఇప్పటివరకు పాత పన్ను విధానాన్ని అనుసరిస్తూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్న పన్ను చెల్లింపుదారులకు ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం పారదర్శకతను పెంచుతూ, తప్పులేని క్లెయిమ్‌లు నివారించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది. దీంతో ఇకపై ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ప్రతి మినహాయింపు కోసం నిర్ధారిత ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వారికి మినహాయింపుల అవసరం ఉండదు గనుక, వారు ఈ నిబంధనల నుండి మినహాయించబడతారు.

ఉద్యోగులు సాధారణంగా తమ సంస్థల నుంచి వచ్చే ఫారం-16 ఆధారంగా ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 రూపాల్లో రిటర్నులు దాఖలు చేస్తారు. కానీ ఈసారి నుంచి సెక్షన్ 80సీ, 80డీ, 80డీడీ, 80యూ, ఇంటి అద్దె భత్యం వంటి మినహాయింపుల కోసం నిబంధనలకు అనుగుణంగా ఆధారాలు తప్పనిసరిగా సమర్పించాలి. లేకపోతే మీ క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశం ఉంది. ఇంకా తప్పు వివరాలు ఇచ్చినట్లయితే ఐటీఆర్ తిరస్కరణకు కూడా అవకాశం ఉంటుంది.

మీ దగ్గర గృహ రుణం ఉన్నట్లయితే, మీరు సెక్షన్ 24(బీ) కింద రూ.2 లక్షల వరకూ వడ్డీపై మినహాయింపు పొందవచ్చు. కానీ ఈసారి కేవలం వడ్డీ మొత్తం తెలిపినంత మాత్రాన సరిపోదు. మీరు ఏ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు? అకౌంట్ నంబరు, లోన్ తీసుకున్న తేదీ, మొత్తం ఎంత తీసుకున్నారు, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత బాకీ ఉంది? వంటి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. మీ బ్యాంక్ నుంచి ఈ సమాచారం తీసుకోవాలి.

ఆరోగ్య బీమా ప్రీమియాల కోసం సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు మినహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రుల బీమా కోసం అదనంగా క్లెయిమ్ చేయవచ్చు. కానీ పాలసీ ఏ కంపెనీ నుంచి తీసుకున్నది, పాలసీ నంబర్ వంటి వివరాలు ఇంతకుముందు అవసరం లేకపోయినా, ఇప్పుడు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

మీ కుటుంబంలో దివ్యాంగుల కోసం ఖర్చుచేసిన వైద్య ఖర్చులు లేదా సంరక్షణ ఖర్చులు సెక్షన్ 80డీడీ కింద మినహాయింపుగా తీసుకోవచ్చు. సాధారణ వైకల్యం ఉన్నవారికి రూ.75,000 వరకు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.1,25,000 వరకు మినహాయింపు లభిస్తుంది. దీనికోసం ఆధారపడిన వారి పాన్, ఆధార్, అలాగే 10ఏఐ ధ్రువీకరణ తప్పనిసరి.

ఉన్నత విద్య కోసం తీసుకున్న విద్యా రుణాలపై చెల్లించే వడ్డీ మొత్తం సెక్షన్ 80ఈ కింద మినహాయింపుగా పరిగణిస్తారు. ఇది మొత్త పరిమితికి లోబడి ఉండదు. కానీ రుణం ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? వడ్డీ ఎంత చెల్లించారు? ఇంకా ఎంత బాకీ ఉంది? వంటి అన్ని వివరాలు ఈసారి తప్పనిసరిగా పేర్కొనాలి.

విద్యుత్ వాహనాన్ని 2019 ఏప్రిల్ 1 నుండి 2023 మార్చి 31 మధ్య కాలంలో కొనుగోలు చేసి దానికి రుణం తీసుకున్న వారు సెక్షన్ 80ఈఈబీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వడ్డీపై మినహాయింపు పొందవచ్చు. కానీ వాహన రిజిస్ట్రేషన్ నంబరు సహా ఇతర రుణ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.

ఇంకా అత్యంత ప్రాధాన్యమైన సెక్షన్ 80సీ కింద ఈపీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియాలు, ఇంటి రుణ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు మొదలైనవి మినహాయింపు పొందేలా క్లెయిమ్ చేయవచ్చు. కానీ ప్రతి క్లెయిమ్‌కు తగిన ధ్రువీకరణలు తప్పనిసరిగా ఉండాలి. బీమా పాలసీ ప్రీమియాల కోసం పాలసీ నంబర్ కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి.

ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) క్లెయిమ్ చేసుకునే వారు ఫారం 10బీఏ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది.

ఈ మార్పులన్నింటి దృష్ట్యా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే ముందు, మీకు అనుకూలమైన పాత పన్ను విధానం మంచిదా? లేక కొత్త విధానమా? అన్నది స్పష్టంగా అర్థం చేసుకుని, అవసరమైన ఆధారాలతో సకాలంలో రిటర్నులు దాఖలు చేయాలి. ప్రజలకు అవకాశం ఇవ్వడం కోసం ఆదాయపు పన్ను శాఖ రిటర్నుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఈ అవకాశం వినియోగించుకుని జాగ్రత్తగా, సమగ్రంగా ఐటీఆర్ ఫైల్ చేయడం మంచిది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement