Breaking News

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)‎ని రంగంలోకి దింపింది కేంద్రం.

కేంద్రసాయుధ బలగాల్లో అత్యంత శక్తివంతమైన వాటిల్లో ఒకటైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG)‎ని రంగంలోకి దింపింది కేంద్రం.


Published on: 11 Jun 2025 07:09  IST

దేశ భద్రతకు శాశ్వతంగా ముప్పుగా మారిన నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోదని స్పష్టంచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే అనేకసార్లు ఈ విషయాన్ని బహిరంగ వేదికలపై ప్రస్తావిస్తూ, 2026 మార్చి నాటికి దేశాన్ని నక్సల్స్‌ ఉనికి నుంచి విముక్తం చేస్తామన్న సంకల్పాన్ని ప్రకటించారు.

ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కీలకంగా రూపొందించిన వ్యూహమే "ఆపరేషన్ కగార్". ఇందులో కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జిల్లా రిజర్వ్ గార్డ్స్ (DRG), మరియు రాష్ట్ర పోలీసు దళాలు కలిసి మావోయిస్టు గుట్టులను ధ్వంసం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఈ ఆపరేషన్ ఫలితాలు కనపడుతున్నాయి. మావోయిస్టుల ప్రధాన నాయకుల్లో ఉన్న నంబాల కేశవ్, సుధాకర్ లాంటి కీలక చీఫ్ కమాండర్లను ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టిన భద్రతా బలగాలు, వారి శక్తిని బలహీనపరచడంలో పురోగతి సాధించాయి.

మావోయిస్టులు ఇంకా కోలుకోకముందే కేంద్ర ప్రభుత్వం మరింత తీవ్రంగా స్పందించింది. దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రత్యేక భద్రతా దళాల్లో ఒకటైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బలగాలను మావోయిస్టు ప్రాంతాల్లో మోహరించింది. ఇప్పటివరకు ఉగ్రవాద దాడులు, హైరిస్క్ ఆపరేషన్లకే పరిమితమైన ఎన్ఎస్‌జీ, ఈసారి తొలిసారిగా నక్సల్స్ వ్యతిరేకంగా రంగంలోకి దిగడం దేశ భద్రతా రంగంలో కీలక మలుపుగా భావించబడుతోంది.

మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో మావోయిస్టుల పట్టు గట్టిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అక్కడ ఎన్ఎస్‌జీ మోహరించడంతో పరిస్థితి పూర్తిగా భద్రతా బలగాల పక్షానకి మారిందని అధికారులు పేర్కొంటున్నారు. అధునాతన శిక్షణతో కూడిన ఈ ప్రత్యేక బలగాల రాకతో మావోయిస్టులకు ఎదురు తిరిగే అవకాశాలు మరింత తగ్గిపోయాయి.

ఇప్పటికే వరుస ఎదురుదెబ్బలతో మావోయిస్టుల శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఎన్ఎస్‌జీ రంగప్రవేశం ఆ పార్టీకి కొత్త సవాలుగా మారింది. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, ఇది మావోయిస్టుల వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బగానే కాక, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దూకుడు వైఖరి స్పష్టంగా కనిపిస్తున్న ఉదాహరణగా నిలుస్తోంది.

ఓవైపు మావోయిస్టు నేతలు శాంతి చర్చలకు సిద్ధమని చెబుతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు ఆసక్తి చూపకుండా నేరుగా సైనిక శక్తితో వారి ప్రభావాన్ని నిర్మూలించాలనే దిశగా ముందుకెళ్తోంది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్రం ఎలాంటి రాజీకి వెనకాడదన్న సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి