Breaking News

దేశంలో అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా పేరున్న ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో మోసాలు

దేశంలో అయిదో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా పేరున్న ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో మోసాలు


Published on: 30 May 2025 08:52  IST

సాధారణంగా ప్రతి మనిషి కొంత కొంత పొదుపు చేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. అయితే ఆ డబ్బు ఎంతవరకు భద్రమే అనే అనుమానం ఇప్పుడిప్పుడే ఎక్కువమవుతోంది. ముఖ్యంగా బ్యాంకుల్లో జరుగుతున్న అవకతవకలు బయటపడుతున్న తరుణంలో, సామాన్యుల విశ్వాసం నెమ్మదిగా దెబ్బతింటోంది. "మన డబ్బు నిజంగా సేఫ్‌నా?" అన్న సందేహం ప్రతి ఖాతాదారుడిని వెంటాడుతోంది. ఆర్బీఐ తరచూ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా స్థిరంగా ఉందని చెబుతోంది. కానీ కొన్ని బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు ఆ మాటలకు తలకొరివిగా మారుతున్నాయి. తాజాగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ లో చోటుచేసుకున్న ఘటనలతో మళ్లీ ప్రజలలో ఆందోళన మొదలైంది.

హిందూజా గ్రూప్‌కు చెందిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ దేశంలో ఐదవ అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌. మూడుదశాబ్దాలుగా సేవలందిస్తున్న ఈ బ్యాంక్, ఇటీవలి కాలంలో మాత్రం అకౌంటింగ్ లోపాలు, రుణాల విషయంలో మోసపూరిత కార్యకలాపాలు, ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వంటి కారణాలతో వార్తల్లో నిలుస్తోంది.2025 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బ్యాలెన్స్‌షీట్‌ లో లోపాలు, మైక్రో ఫైనాన్స్‌ విభాగంలో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా బ్యాంక్‌ లోపలి ఆడిట్లు, ఉన్నతాధికారుల రాజీనామాలు, ఫోరెన్సిక్‌ విచారణ వంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ICAI) కీలక నిర్ణయం తీసుకుంది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆర్థిక నివేదికలను సమీక్షించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సమీక్షను ICAI ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డు (FRRB) నిర్వహించనుంది. ICAI అధ్యక్షుడు చరణ్‌జోత్‌ సింగ్‌ నందా వెల్లడించిన వివరాల ప్రకారం – బ్యాంక్‌ ఆడిటింగ్‌ మరియు అకౌంటింగ్‌ వ్యవహారాలు "కంపెనీల చట్టం 2013" లో పేర్కొన్న షెడ్యూల్‌ II, IIIతో పాటు, RBI ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్నదే ఈ సమీక్షలో ప్రధాన అంశం.

ఈ సమీక్షతోపాటు, బ్యాంక్‌ నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, ఖాతాదారుల సమాచారం పట్ల చిత్తశుద్ధి తక్కువగానే ఉండటం వంటివి ముఖ్యాంశాలుగా పరిశీలనకు వస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే, ఈ రకమైన సమీక్షలు, కఠిన చర్యలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ఉదంతం ఒక్కదాన్ని మాత్రమే కాదు. గతంలో యెస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వంటి ఘటనలతోనే ప్రజలు ఇప్పటికే కొన్ని అనుమానాలతో ఉన్నారు. ఇప్పుడు ఇండస్‌ఇండ్‌ వ్యవహారం, ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టే. అందుకే ఈసారి ICAI చేపట్టిన సమీక్ష ద్వారా నిజాలు బయటకు వస్తే, ఖాతాదారులకు కొంతమేర ఊపిరి పీల్చే అవకాశముంది.

Follow us on , &

ఇవీ చదవండి