Breaking News

2030 నాటికి జపాన్ దేశవ్యాప్తంగా కృత్రిమ రక్తం సాంకేతికతను వాడే అవకాశం ఉంది.

జపాన్ కు చెందిన నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమి సకాయ్, ఆమె టీం కృత్రిమ రక్తాన్ని తయారు చేస్తున్నారు.


Published on: 30 May 2025 17:04  IST

రక్తం లేకుండా మానవ శరీరం పని చేయదు. అత్యవసర పరిస్థితుల్లో, యాక్సిడెంట్లు, పెద్ద ఆపరేషన్ల సమయంలో రక్తం సమయానికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జపాన్ శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రపంచ వైద్యరంగంలో మరో అద్భుతమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

మానవ శరీరంలో రక్తం అనేది ఒక మూలాధార వ్యవస్థ. ఇది ఆక్సిజన్‌ను ప్రతి అవయవానికి తరలించడమే కాక, శరీర వ్యర్థాలను బయటకు పంపించడం, పోషకాలను సరఫరా చేయడం, రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేయడం లాంటి అనేక కీలక పాత్రలు పోషిస్తుంది. రక్తం లో ఎర్ర కణాలు (RBCs), తెల్ల కణాలు (WBCs), ప్లేట్లెట్లు, ప్లాస్మా ఉన్నాయి. ఇవన్నీ కలిసే మన ఆరోగ్యాన్ని నిలబెడతాయి.

అయితే, అవసరానికి తగ్గట్టు సరైన బ్లడ్ గ్రూప్ అందక ప్రాణనష్టం జరగడం ఇది ప్రస్తుత వైద్య వ్యవస్థలో మాంద్యం లాంటిది.. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది.

జపాన్ శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కారం – ఆర్టిఫిషియల్ బ్లడ్

నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న ఈ కృత్రిమ రక్తం (Artificial Blood) వాస్తవ రక్తానికి సమానమైన విధంగా పనిచేస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే:

  • అన్ని రక్తగ్రూపులకు ఉపయోగపడుతుంది — అంటే, ఇది యూనివర్సల్‌గా పని చేస్తుంది.

  • డొనర్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

  • వెచ్చని గోధుమ రంగులో ఉంటుంది.

  • ఇది రెండేళ్ల వరకు నిల్వచేసుకోవచ్చు, ఇది ఇప్పటి రక్త నిల్వల కన్నా 24 రెట్లు ఎక్కువ shelf-life.

తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ కృత్రిమ రక్తం తయారీ చాలా శాస్త్రీయంగా జరుగుతోంది:

  • గడువు ముగిసిన రక్తపు బ్యాగుల నుంచి హిమోగ్లోబిన్‌ను వేరు చేసి, దాన్ని వైరస్‌కి రక్షణగా ఉండే ప్రత్యేక షెల్‌లో నిల్వ చేస్తారు.

  • ఈ హిమోగ్లోబిన్‌తో కృత్రిమ ఆక్సిజన్ క్యారియర్లు తయారవుతాయి, ఇవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేస్తాయి.

  • చువో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తెయుకి కోమాట్స్ బృందం దీనిలో ప్లాస్మాలో ఉండే అల్బుమిన్ అనే ప్రొటీన్‌ను వాడి, రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించేలా తయారు చేశారు.

  • స్ట్రోక్, బీపీ, రక్తస్రావం వంటి సమస్యలకు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని తెలుస్తోంది.

ఈ ఆవిష్కరణకు ముందు నుంచి శ్రమిస్తున్నది ప్రొఫెసర్ హిరోమి సకాయ్ బృందం. ఆమె నేతృత్వంలో నారా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనేక పరీక్షలు, ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈ బృందం అభివృద్ధి చేసిన కృత్రిమ రక్తాన్ని ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో పరీక్షిస్తున్నారు.

2030 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం!

ప్రస్తుతం శాస్త్రవేత్తలు 100 నుండి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని స్వచ్ఛందంగా తీసుకునే వాలంటీర్లపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇది సురక్షితమైనదిగా, శక్తివంతమైనదిగా నిరూపితమైతే, 2030 నాటికి జపాన్ దేశవ్యాప్తంగా ఈ సాంకేతికతను వాడే అవకాశం ఉంది.

ఈ కృత్రిమ రక్తంతో లాభాలు ఏమిటి?

  • అత్యవసర పరిస్థితుల్లో రక్త కొరత ఉండదు.

  • దాతలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

  • సుదూర గ్రామాల్లో కూడా ఇది నిల్వ చేసి అవసరమయ్యే సమయంలో వాడొచ్చు.

  • వైరస్‌లు వ్యాపించే ప్రమాదం లేకుండా రక్త మార్పిడి జరుగుతుంది.

ఈ కృత్రిమ రక్త ఆవిష్కరణ ఒక వైద్య విప్లవం. భవిష్యత్తులో ఇది అనేకమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. మనం చూడబోయే ప్రపంచం లో... “రక్తం లేదు కాబట్టి చికిత్స ఇవ్వలేము” అనే మాటలు చరిత్రగతం అవుతాయి!

Follow us on , &

ఇవీ చదవండి